గాడ్ ఫాదర్ ఎవరు లేకున్నా.. స్వయంకృషి, పట్టుదల, ప్రతిభతో తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్గా ఎదిగిన వారిలో అడివి శేష్ ఒకరు. చిన్నాచితకా పాత్రలు చేస్తూనే హీరోగా మెప్పించారు. అలాగే రైటర్గా, దర్శకుడిగా సత్తా చాటుతున్నారు. 26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథతో తెరకెక్కిన ‘‘మేజర్’’ సినిమాతో అడివి శేష్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయారు. ఈ సినిమాలో ఆయన నటన, యాక్షన్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు అడివి శేష్ను అభినందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇస్తూ.. వ్యక్తిగత వివరాలను పంచుకున్నారు.
ఆయన పెళ్లి గురించి యాంకర్ ప్రశ్నించగా.. అడివి శేష్ స్పందించారు. అమెరికాలో వున్నప్పుడు తాను ఓ పంజాబీ అమ్మాయిని ప్రేమించినట్లు తెలిపాడు. కానీ కొన్ని కారణాలతో తమ బంధం తెగిపోయిందని… అది కూడా తన పుట్టినరోజు నాడే ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్లిపోయిందని శేష్ చెప్పారు. ఆ తర్వాత రిలేషన్స్లో ఉన్నాను కానీ.. పెళ్లి వరకూ తీసుకెళ్లే ధైర్యం రాలేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి తన దృష్టి మొత్తం సినిమాలపైనే వుందని శేష్ స్పష్టం చేశారు. పెళ్లి గురించి ఇంట్లోవాళ్లు అడిగి అడిగి కాస్త విసిగిపోయారని.. . ప్రస్తుతం తన చెల్లి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు అని అడివి శేష్ వివరించారు.
ఇక.. సినిమాల విషయానికి వస్తే మేజర్ సక్సెస్ జోష్లో వున్న ఆయన ‘‘హిట్ ది సెకండ్ కేస్’పై దృష్టి పెట్టనున్నారు. ఈ చిత్రానికి సైలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండగా.. తిపేర్నేని ప్రశాంతి నిర్మిస్తున్నారు. అడివి శేష్ సరసన మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు.