ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సారథ్యంలో ప్రారంభమైన ‘‘ఆహా’’ ఓటీటీకి మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. రియాలిటీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్లు, ఒరిజిన్స్లతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. వీటిలో నందమూరి బాలకృష్ణ హోస్ట్గా చేసిన ‘‘అన్స్టాపబుల్’’ షోకి మంచి పేరు వచ్చింది. బాలయ్య లాంటి అగ్రహీరో తొలిసారి ఇలాంటి వేదికలపై రావడంతో ఈ షోకి ఎక్కడా లేని బజ్ వచ్చింది. ముఖ్యంగా స్టార్స్ని ఆయన డీల్ చేసిన విధానం ప్రజలకు బాగా నచ్చింది. దీంతో కేవలం బాలయ్య షో చూడటానికే ఆహా సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారు ఎందరో.
అయితే ఈ షోలో బాలయ్య సమకాలీకుడు మెగాస్టార్ చిరంజీవిని తీసుకోవాలని అభిమానులు కోరుకుంటూ మెసేజ్లు పెట్టారు. నిజానికి సినిమాల పరంగా పోటీ వున్నప్పటికీ బాలయ్య- చిరంజీవిల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ వుంది. ఒకరి ఇంట్లో శుభకార్యాలకు మరొకరు హాజరవ్వడంతో పాటు పలు వేదికలపైనా వీరద్దరూ కలుసుకునేవారు. ఈ నేపథ్యంలో అన్స్టాపబుల్కి చిరంజీవిని గెస్ట్గా తీసుకురావాలని అల్లు అరవింద్ ప్రయత్నించారు.
అప్పట్లో చిరంజీవి సినిమా షూటింగ్లు, మిగిలిన వ్యవహారాల్లో బిజీగా వుండటంతో వీలు పడలేదు. అయితే అన్స్టాపబుల్ 2కి మాత్రం ఎట్టి పరిస్ధితుల్లోనూ చిరుని తీసుకురావాలని అల్లు ఫ్యామిలీ గట్టిగా వుంది. మొదటి ఎపిసోడ్ కి చిరుని గెస్ట్ గా తీసుకొస్తే మరింత బజ్ వస్తుందని భావిస్తున్నారు. ఆ తరువాత వెంకటేష్, నాగార్జున కూడా ఈ సీజన్ లో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. వీరి వీటన్నింటికి చెక్ పడాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.