టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ జీవిత, రాజశేఖర్లు చిక్కుల్లో పడ్డారు. పరువు నష్టం కేసులో వీరిద్దరికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో వారిద్దరికి జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్ నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెజిస్ట్రేట్ తీర్పును వెలువరించారు. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో నడుస్తున్న బ్లాడ్బ్యాంక్పై వారు చేసిన ఆరోపణలకు గాను దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం రాజశేఖర్, జీవితలకు జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించింది. అలాగే అప్పీల్కు అవకాశం ఇస్తూ.. బెయిల్ కూడా మంజూరు చేసింది.
అసలేంటీ వివాదం :
తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు ఎంతో కొంత చేసి వారి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి బ్లడ్బ్యాంక్ను ఏర్పాటు చేశారు. బ్లడ్ డొనేషన్పై అవగాహన కల్పిస్తూ, క్యాంపులు నిర్వహిస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడారు చిరంజీవి. ఆయన పిలుపుతో మెగా అభిమానులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. అయితే జీవిత , రాజశేఖర్ దంపతులు 2011లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్లడ్ బ్యాంక్ పేరుతో అభిమానుల రక్తాన్ని సేకరించి.. దానిని డబ్బుకు అమ్ముకుంటున్నారంటూ ఈ దంపతులు ఏకంగా ప్రెస్మీట్ పెట్టి మరి ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. అంతేకాదు.. వీరి వ్యాఖ్యల కారణంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్కు రక్తదానం చేసేందుకు చాలా మంది వెనుకాడారు.
ఈ వ్యాఖ్యలపై గీతా ఆర్ట్స్ అధినేత, చిరంజీవి బంధువు అల్లు అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవిత, రాజశేఖర్ దంపతులపై పరువు నష్టం దావా వేశారు. 2011 నుంచి కొనసాగుతున్న ఈ కేసు విచారణ ఇటీవలే ముగిసింది. తాజాగా కోర్ట్ తుది తీర్పు వెలువరించింది.
Also Read:
పవన్పై రగిలిపోతోన్న వైసీపీ ప్రభుత్వం.. ‘‘బ్రో’’పై జగన్ పగ సాధిస్తారా, వణికిపోతోన్న చిత్ర పరిశ్రమ